Uncategorized

గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు

జూలై 1న రూ.7 వేలు ఇస్తాం.. వలంటీర్‌ వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం.. మంత్రులు నిమ్మల, డోలా, సవిత

అమరావతి: జూలై ఒకటో తేదీ ఉదయాన్నే సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుతో పాటు, డీఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, అన్నా క్యాంటిన్లు, స్కిల్‌ సెన్సెస్‌ ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతు, ఇతర పింఛన్లను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ. మూడు వేల నుంచి రూ.ఆరు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ క్రమంలో ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ.వెయ్యి చొప్పున జూలై నెల పింఛన్‌తో కలిపి వృద్ధులు, వితంతు మహిళలకు జూలై ఒకటో తేదీ ఉదయాన్నే ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు. అదే విధంగా దివ్యాంగులకు సైతం పెంచిన పింఛన్లను అరియర్స్‌తో ఇస్తామన్నారు. 16,347 పోస్టులతో డీఎస్సీని నిర్వహించనున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు చట్టాలను ఆ పార్టీ పాలిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో సైతం అమలు చేయడం లేదని, అదే తరహాలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తాము వ్యతిరేకించినట్లు వివరించారు.

గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థ రద్దు కాలేదని, ఈసీఐ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారన్నారు. అయితే పలువురు వలంటీర్‌లు రాజీనామాలు చేశారని, త్వరలో శాఖాపరమైన రివ్యూ నిర్వహించి ఈ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే వివిధ శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నామన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, వంటి కీలక పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, మద్యం, డ్రగ్స్‌ వినియోగంతో రాష్ట్రంలో నిర్విర్యమైన యువతలో నైపుణ్యాలు పెంపునకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని మరో మంత్రి డోలా తెలిపారు. ఒక్క చాన్స్‌ అని మాజీ సీఎం జగన్‌ ప్రజలను మోసం చేశారని మంత్రి ఎస్‌.సవిత విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button