Uncategorized

విజయంతో గంభీర్‌ శకం ప్రారంభం.. 

శ్రీలంక పర్యటనను భారత్‌ విజయంతో ప్రారంభించింది. శనివారం (జులై 27వ తేదీ) పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును టిమిండియా ఓడించింది. హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) నేతృత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల పతనానికి 213 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 170 పరుగులకే కుప్పకూల్చింది. కాగా.. ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లో 58 పరుగులు చేసి భారత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన టిమిండియా కెప్టెన్ సూర్య కుమార్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత అసలంక.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్‌ పలకడంతో వారి స్థానాలను రిజర్వ్‌ చేసుకునే లక్ష్యంతో ఉన్న యువ ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌.. మొదటి నుంచే దూకుడుగా ఆడి భారత్‌కు అదిరే ఆరంభం ఇచ్చారు. జైశ్వాల్‌ (21 బంతుల్లో 40 రన్స్‌), గిల్‌ 16 బంతుల్లో 34 రన్స్‌ స్కోరు చేశారు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ 26 బంతుల్లో 58 రన్స్‌తో చెలరేగిపోయాడు. చివర్లో రిషభ్‌ పంత్‌ 33 బంతుల్లో 49 రన్స్ చేయడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 213/7 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పతుమ్ నిశాంక (48 బంతుల్లో 79 రన్స్‌), కుశాల్ మెండిస్‌ (27 బంతుల్లో 45 రన్స్‌) చేయడంతో శ్రీలంక లక్ష్యం దిశగా సాగింది. ఓ దశలో 14 ఓవర్లకు 140/1తో నిలిచింది. చివర్లో భారత బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. 19 వ ఓవర్‌ వేసిన రియాన్ పరాగ్ మొదటి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసి.. శ్రీలంకను మడతపెట్టేశాడు. దీంతో.. రియాన్ మూడు వికెట్లు తీసినట్టయింది. ఫలితంగా.. శ్రీలంక 43 పరుగులు తేడాతో ఓడిపోయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button