Uncategorized

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే ధృవపత్రాల జారీ !

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. పౌరసేవల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం(జనవరి 29) సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం జనవరి 30వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. రేపు వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button