Uncategorized

పెన్షన్ల విషయంలో మోదీ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రూ.2 లక్షలు ఫైన్

Supreme Court: కేంద్ర ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయడంలో చేస్తున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన సైనిక అధికారులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకం ప్రకారం.. పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా మండిపడింది. ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ వ్యవహారంలో నరేంద్ర మోదీ సర్కార్‌కు చివరి అవకాశం ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకు చేసిన ఆలస్యానికి కేంద్రంపై రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ సమస్యను నవంబర్ 14 వ తేదీ లోపు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.

భారత ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసిన రిటైర్డ్‌ రెగ్యులర్‌ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం.. గత కొన్నేళ్ల నుంచి ఒక నిర్ణయానికి రాకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకం ప్రకారం.. రిటైర్డ్ ఆర్మీ అధికారులకు పింఛను చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తేల్చింది. అంతేకాకుండా ఈ పెన్షన్ ప్రక్రియలో సంవత్సరాల తరబడి ఆలస్యం చేస్తోందని మండిపడింది. ఈ క్రమంలోనే జరిగిన తప్పుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.2 లక్షల జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు వెలువరించింది. ఇదే ప్రభుత్వానికి ఇచ్చిన చివరి అవకాశం అని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం.. నవంబర్‌ 14 వ తేదీ లోగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే ఈ పెన్షన్‌ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు చేసింది.

సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అధికారుల పింఛనుకు సంబంధించి నెలకొన్న సమస్యలపై దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాకపోవడంపై ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగానే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నాళ్లు ఈ ఆలస్యం కొనసాగుతుందని ప్రశ్నించింది. 2021 నుంచి ఈ వ్యవహారంపై చర్చ జరుగుతున్నా.. ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. నవంబర్‌ 14 వ తేదీలోగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని.. అలా జరగని పక్షంలో రిటైర్డ్‌ రెగ్యులర్‌ కెప్టెన్లకు 10 శాతం పెన్షన్‌ పెంచేలా తామే ఆదేశాలు ఇస్తామని తేల్చి చెప్పింది.

ఇక ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భట్టీ హాజరై వాదనలు వినిపించారు. ఇందులో తాను కేవలం సుప్రీంకోర్టుకు క్షమాపణలు మాత్రమే చెప్పగలనని.. తమకు ఇంకో అవకాశం ఇవ్వాలని.. ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఐశ్వర్య భట్టీ కోర్టుకు విన్నవించుకున్నారు. అందుకోసం 3 నెలల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పెన్షన్ ఇచ్చేందుకు 6 సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిశీలించాల్సి ఉందని అందుకే సమయం పడుతుందని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఇందుకోసం మరో అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే మొదట సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించినా.. చివరికి ఒక అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button