Uncategorized

వాలంటీర్ వ్యవస్థ రద్దు?.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై క్లారిటీ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ మీద ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వాలంటీర్లకు టీడీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ల భవిష్యత్తు విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. వాలంటీర్లు ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మి.. భయాందోళనలకు గురికావొద్దని మంత్రి సూచించారు.

ఇక ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వాలంటీర్లను రాజకీయాల కోసం వాడుకున్నదని వైసీపీ నేతలేనని ఆరోపించిన మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి.. బలవంతంగా రాజీనామాలు కూడా చేయించారని గుర్తు చేశారు. రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి వాలంటీర్ల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇలాంటి కథనాలను, వార్తలను నమ్మి భయపడవద్దని మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అలాగే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా.. గౌరవ వేతనం పెంపు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు మీద మంత్రివర్గం నుంచి క్లారిటీ లేదు. అయితే ఇదే సమయంలో సోమవారం కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఏపీవ్యాప్తంగా ఉండే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్లస్టర్ల వారీగా క్రియేట్ చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను తొలగించాలని ఆదేశించింది. సోమవారం సాయంత్రంలోగా డిలీట్ చేయాలని ఆదేశించింది. ప్రజలు కూడా ఇలాంటి గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని సూచించింది. దీంతో వాలంటీర్ వ్యవస్థను రద్దుచేస్తారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button