Uncategorized

వైసీపీకి మరో షాక్.. జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి పలువురు నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. తాజాగా కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్టీకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అనుచరులకు పార్టీకి రాజీనామా చేయడంపై సంకేతాలు ఇచ్చేశారంట.. జనసేన పార్టీలోకి వెళ్లబోతున్నట్లు చెప్పేశారట.. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కాకినాడ జిల్లాలో తాజాగా వైఎస్సార్‌‌సీపీకి షాక్ తగిలింది.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దొరబాబు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.. అయితే అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని పిఠాపురంలో టాక్ వినిపించింది. తాజాగా అనుచరులతో సమావేశం నిర్వహించి.. వైఎస్సార్‌‌సీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు ఫ్యాన్ పార్టీని వీడటం ఖాయం అంటున్నారు. దొరబాబు బుధవారం తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.

పెండెం దొరబాబు 2004లో బీజేపీ నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరగా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దగ్గరి వ్యక్తిలా ఉన్నారు. 2012లో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరగా.. 2014లో ఆ పార్టీ నుంచి పిఠాపురంలో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పిఠాపురంలో పోటీచేసి విజయం సాధించారు.. అయితే 2024 ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ టికెట్ నిరాకరించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో.. సీనియర్ నేత వంగా గీతను పోటీ చేయించారు. అయినా సరే దొరబాబు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగారు.. గీత గెలుపు కోసం పనిచేశారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత దొరబాబు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నాకు హాజరుకాలేదు. అంతకు కొద్ది రోజుల ముందు నుంచే దొరబాబు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దొరబాబు తన రాజీనామాపై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button