Uncategorized

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్‌ స్కెచ్‌.. ఏడో పెళ్లిలో దొరికి పోయిందిలా!

ఇద్దరు మహిళలు తల్లీకూతుళ్లుగా నాటకాలాడి ఏకంగా ఆరుగురిని బురిడీ కొట్టించి భారీ మొత్తంలో లూటీ చేశారు. వీరికి మరో ఇద్దరు పెళ్లిళ్ల పేరయ్యలు ధనవంతులైన ఒంటరి కుర్రాలను వలేసిపట్టి పెళ్లి చేసేవారు. ఆనక యువతిని కాపురానికి పంపించి.. అవకాశం దొరకగానే ఆ ఇంట్లో బంగారు నగలు, డబ్బు తీసుకుని ఉడాయించడం ఈ రాకెట్ స్కెచ్..

ఓ యువతి డబ్బున్న ఒంటరి పురుషులే లక్ష్యంగా.. ప్రేమ, పెళ్లి పేరిట ఘరానా మోసాలకు పాల్పడింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సజావుగా కాపురం చేసి, ఆనక అవకాశం దొరకగానే ఇంట్లో డబ్బు, నగలతో ఉడాయించేది. ఇలా ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకుని ఊడ్చేసింది. తాజాగా ఏడో పెళ్లికి రెడీ అవగా పోలీసులకు చిక్కింది. పోలీసుల దర్యాప్తులో ఈ కిలాడీ లేడీ వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు తేలింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ బాందా జిల్లాలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని బండాకు చెందిన పూనమ్ వధువుగా, సంజనా గుప్తా ఆమె తల్లిగా, విమలేశ్‌ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి పెళ్లిళ్ల పేరయ్యలుగా.. నలుగురూ ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో విమలేశ్‌ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి అనే వ్యక్తులు డబ్బున్న ఒంటి కుర్రాళ్ల వేటలో ఉండేవారు. అలా టార్గెట్ దొరకగానే విమలేశ్‌ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి రంగంలోకి దిగి ఈడుజోడైన అమ్మాయిని చూపిస్తామని చెప్పి.. తొలుత ఫీజుగా అతని నుంచి రూ.1.5 లక్షలు తీసుకుని.. పెళ్లి జరిపిస్తారు. అనంతరం పూనమ్‌ భర్త వెంట అత్తింటికి వెళ్తుంది. అవకాశం దొరికేవరకు అతడితో కాపురం చేసి.. ఆనక ఆ ఇంట్లో డబ్బు, బంగారతో ఉడాయించేది. ఈ క్రమంలో తాజాగా త్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన శంకర్‌ ఉపధ్యాయ్‌ అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో శనివారం శంకర్‌కు పూనమ్‌ను పరిచయం చేసి, అతని నుంచి రూ.1.5 లక్షలు డిమాండ్‌ చేశారు. విమలేశ్‌ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతిపై అతడికి అనుమానం కలిగింది. దీంతో పూనమ్, సంజనల ఆధార్‌కార్డులు చూపాలని శంకర్‌ అడిగాడు. వారు చూపకపోగా తనను చంపేస్థానని బెదిరించారని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని చెప్పి శంకర్‌ వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు కథ బయటపడింది.

వీరిది ఓ రాకెట్ అని, ఇప్పటికే పూనమ్ ఆరు పెళ్లిళ్లు చేసుకుని దొంగతనాలు చేసి తప్పించుకున్నట్లు తేలింది. దీంతో ఇద్దరు మహిళలతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి పురుషులను పెళ్లి పేరిట మోసం చేసి, ఆపై వారి ఇళ్లలో నగదు, ఆభరణాలను దొంగిలించే రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button