Uncategorized

అర్హులైనా రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జులై 18న తొలి విడతలో రూ. లక్షలోపు, జులై 31న రెండో విడతలో రూ. లక్షన్నర లోపు.. ఆగస్టు 31న మూడో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే చాలా మంది రైతులకు అర్హులైనప్పటికీ రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాలేదని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మెుత్తం 31 సాంకేతిక కారణాలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

ఈ నేపథ్యంలో అర్హులైనా రైతు రుణమాఫీ కానీ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హత ఉండి, ఇంకా రైతు రుణమాఫీ సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమిస్తున్నామని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు. రైతువేదికల్లోని రైతులతో మంగళవారం (ఆగస్టు 20) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. రైతులు తమ ఆధార్‌ కార్డులోని సమాచారం, సంబంధిత బ్యాంకు వద్ద నమోదైన డేటాలో చిన్నచిన్న తప్పులు, రైతు పట్టాదారు పాస్‌పుస్తకాల సమస్యలు, పేరు సరిగా లేకపోవడం వంటి ఫిర్యాదులను ఆయా మండలాల్లోని నోడల్‌ అధికారికి అందజేయాలని సూచించారు.

మంగళవారం నుంచే ఈ ప్రక్రియ మెుదలైందని మండల వ్యవసాయాధికారి కార్యాలయాలతో పాటు రైతు వేదికల్లో ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందన్నారు. ఇక రూ.రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక షెడ్యూలు, విధివిధానాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. కుటుంబ సమూహానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని.. వాటికి పరిష్కారానికి కూడా త్వరలోనే ప్రభుత్వం విధివిధానాలు జారీ చేస్తుందని చెప్పారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రఘునందన్ రావు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button