Uncategorized

చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై నో సీక్రెట్, ఈ నెల 29 నుంచి ప్రజలకు అందుబాటులో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్‌ పోర్టల్‌ మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయిచింది.. ఈ మేరకు ఈ నెల 29 నుంచి ప్రభుత్వం జారీచేసే ప్రతి జీవోనూ జీవోఐఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అంటే ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉంటుంది.. వారు స్వేచ్ఛగా జీవోలను చూడొచ్చు. జీవోఐఆర్ పోర్టల్‌కు సంబంధించి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు.

గతంలో సచివాలయంలోని ప్రతి సెక్షన్‌లోనూ జీవోలకు మాన్యువల్‌ రిజిస్టర్లు నిర్వహించేవారు. కచ్చితంగా వాటిలో నంబరు రాసి, జీవోలు విడుదల చేసేవారు. ఈ జీవోల గురించి ప్రజలకు తెలిసేవి కావు.. కానీ సమాచారహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ పద్దతి మారింది. ప్రతి జీవోనూ ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్‌ రావడంతో.. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం జీవోఐఆర్‌ పోర్టల్‌ను తీసుకొచ్చింది.

అప్పటి నుంచి జీవోఐఆర్‌ పోర్టల్‌ను ప్రభుత్వాలన్నీ దాన్ని కొనసాగించిన సంగతి తెలసిందే. కానీ గత ప్రభుత్వం మాత్రం జీవోల విషయంలో గోప్యత పాటించిందనే విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిరోజులు పోర్టల్ నడిచింది. కానీ కొన్ని జీవోల విషయంలో విమర్శలు రావడంతో రూటు మార్చింది. జీవోఐఆర్‌ పోర్టల్‌కు బదులుగా.. 2008కి ముందున్న మాన్యువల్‌ విధానాన్ని అమల్లో తెచ్చింది. 2021 ఆగస్టు 15న ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

ఈ జీవోఐఆర్ పోర్టల్‌ను మూసేయడంపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా చేయడం సమాచారహక్కు చట్టానికి విఘాతమని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2021 సెప్టెంబరు 7న జీవో నం.100 జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని టాప్‌ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్‌ నేచర్‌ అంటూ కేటగిరీలుగా విభజించింది. వాటిలో కూడా నేచర్‌ జీవోలనే ఏపీ ఈ-గెజిట్‌ పోర్టల్‌లో వారానికోసారి అప్‌లోడ్‌ చేశారు. అయితే కోర్టుం అన్ని జీవోలను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించినా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మొత్తం అన్ని జీవలోను ఈ-గెజిట్‌తో పాటు, ఇతర మార్గాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే గతంలో ఉన్న జీవోఐఆర్‌ పోర్టల్‌ను మళ్లీ ప్రారంభించి.. అన్ని జీవోలు అప్‌లోడ్‌ చేయాలని నిర్ణయించిది. అప్పుడే పాలనలో పారదర్శకత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ప్రభుత్వం జారీ చేసే జీవోలు అన్ని ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రజలు ఈ జీవోలను చూడొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం.. జగన్ సర్కార్ తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button