Uncategorized

సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. వరదలపై ఆరా, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు అందించే హెలికాప్టర్లను తెలంగాణకు పంపిస్తామని ప్రధాని మోదీ సీఎం రేవంత్‌కు హామీ ఇచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ అభినందించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన సీఎం.. వరదల వల్ల వాటిల్లిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

ఇక భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button