Uncategorized

వారికి శుభవార్త చెప్పి యూఏఈ.. భారత రాయబార కార్యాలయం కీలక మార్గదర్శకాలు

వీసా గడువు ముగిసినా తమ భూభాగంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ మరో అవకాశం కల్పించింది. వీసా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు లేదా ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే యూఏఈలోని భారతీయులకు సాయం చేసేందుకు స్థానిక భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం సెప్టెంబరు 1న మొదలై అక్టోబరు 30 వరకు అమలులో ఉంటుంది.

పర్యాటకులు, వీసా గడువు ముగిసిన వారు తమ వీసా స్థితిని పునరుద్ధరించుకోవచ్చు లేదా ఎటువంటి జరిమానా, నిషేధాలు లేకుండా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. యూఏఈలో జన్మించి, సరైన ధ్రువపత్రాలు లేనివారితో పాటు స్పాన్సర్ల నుంచి తప్పించుకొని అక్కడే ఉంటున్నవారికీ ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారికి మాత్రం ఈ వెసులుబాటు వర్తించదు.

ఇక, భారతీయుల విషయానికొస్తే స్వదేశానికి తిరిగి రావాలనుకొంటున్నవారు ఎమర్జెన్సీ సర్టిఫికెటుకు దరఖాస్తు చేసుకోవాలని దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ వెల్లడించింది. ఇక్కడే ఉండాలనుకునేవారు మాత్రం స్వల్పకాలిక పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. దరఖాస్తు చేసుకున్న మర్నాడే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ తీసుకోవచ్చని, దుబాయ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. యూఏఈ జనాభాలో దాదాపు 30 శాతం మంది ప్రవాస భారతీయులే. దాదాపు అక్కడ 35 లక్షల మంది భారతీయులు నివాసముంటున్నట్లు అంచనా.

వీరిలో 20 శాతం మంది అబుదాబీలో ఉండగా.. మిగతా 80శాతం మంది దుబాయ్‌ సహా మిగతా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రయత్నం చట్టం పట్ల గౌరవం, సహనం, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని UAE ప్రభుత్వం నొక్కి చెప్పింది. ప్రక్రియను సులభతరం చేయడానికి, UAE అంతటా ఉన్న సేవా కేంద్రాలు తమ పని వేళలను పొడిగించాయి. ఇప్పుడు చాలా వరకు ఉదయం 7:00 నుంచి రాత్రి 10:00 వరకు తెరిచి ఉంచారు. ఆన్‌లైన్ ధరఖాస్తులు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. గల్ఫ్ దేశాల్లోని మొత్తం భారతీయుల్లో 20 శాతం ఒక్క యూఏఈలో ఉండగా.. మిగిలి ఆరు దేశాల్లో 80 శాతం మంది ఉంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button