Uncategorized

ఆ 2000 నోట్లన్నీ ఇక చిత్తు కాగితాలేనా? RBI మరో కీలక ప్రకటన.. 

Rs 2000 Notes: రూ.2 వేల కరెన్సీ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.96 శాతం రూ.2000 కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపింది. ఇంకా ప్రజల వద్ద రూ.7261 కోట్లు విలువైన పెద్ద నోట్లు ఉన్నాయని తెలిపింది. మే 19, 2023 రోజున చలామణి నుంచి 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాటిని మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. మరి నోట్లు వెనక్కి తీసుకుని ఏడాది గడుస్తున్నా ఇంకా ప్రజల వద్ద ఇన్ని వేల కోట్లు ఉండడం గమనార్హం. మరి ఆ నోట్లన్నీ నష్టపోవాల్సిందేనా? అవి చిత్తు కాగితాలుగా మారాల్సిందేనా?

మే 19, 2023 నాటికి సర్క్యూలేషన్‌లో మొత్తం రూ.3.56 లక్షల కోట్లు విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయి. అవి ఆగస్టు 30, 2024 వరకు చూసుకుంటే రూ. 7261 కోట్లకు తగ్గిపోయినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అంటే మొత్తంగా 97.96 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక వెబ్‌సైట్లో గణాంకాలు వెల్లడించింది. చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత పెద్ద నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయడం, మార్చుకునేందుకు అక్టోబర్ 7, 2023 వరకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

అక్టోబర్ 7, 2023 నుంచి బ్యాంకుల్లో 2000 కరెన్సీ నోట్లు తీసుకోవడం ఆపేశారు. అయితే, వాటిని మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ మరో అవకాశం కల్పించింది. రిజర్వ్ బ్యాంకుకు చెందిన దేశంలోని 19 ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చింది. అలాగే అక్టోబర్ 9, 2023 నుంచి ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులు సైతం వ్యక్తుల నుంచి రూ.2000 నోట్లను డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో పాటు ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించి మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. పోస్ట్ ద్వారా నోట్లతో పాటు వివరాలు పంపిస్తే వాటికి సమానమైన విలువ నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది ఆర్‌బీఐ. అహ్మదాబాద్, బెంగళూరు, బెలపుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఈ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

ఇప్పటికీ తమ వద్ద రూ.2000 కరెన్సీ నోట్లు ఉంటే వాటిని మార్చుకునే అవకాశం ఉంది. నేరుగా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ద్వారా నోట్లు పంపించి బ్యాంక్ ఖాతా వివరాలు అందిస్తే అందులో జమ చేయనుంది. అయితే, ప్రస్తుతం మిగిలి ఉన్న రూ.7261 కోట్లు విలువైన నోట్లలో ఎన్ని తిరిగి వస్తాయనేది చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. దాదాపుగా తిరిగి రాకపోవచ్చంటున్నారు. దీంతో అవి చిత్తు కాగితాలుగా మారిపోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button