Uncategorized

విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. ఫోన్ కాల్‌తో ఆగిపోయిన విమానం, ఎంత పని చేశావు నాయనా!

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడిచింది. ఒక ఫోన్ కాల్‌తో విమానం ఆగిపోగా.. అధికారులు, భద్రతా సిబ్బంది కొద్దిసేపు పరుగులు పెట్టారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు.. ఆ విమానం ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. సీన్ కట్ చేస్తే.. విమానాశ్రయానికి నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడి విమానాన్ని కాసేపు ఆపేందుకు ఇలా చేసినట్లు తేలింది.

ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరింది. అక్కడ విమానం ఎక్కాల్సిన ఒక ప్రయాణికుడు సమయానికి చేరుకోలేకపోయాడు. ఎలాగైనా విమానం ఎక్కాలిన భావించిన వ్యక్తి.. ఆ విమానంలో బాంబు ఉందని కాల్‌ చేసి బెదిరించాడు. కానీ అప్పటికే ఆ విమానం బయలుదేరి.. విశాఖపట్నంకు రాత్రి 08.15 గంటలకు చేరుకుంది. వెంటనే ఇక్కడి సిబ్బందిని అప్పటికే ఢిల్లీ విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులు అప్రమత్తం చేశారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్, బాంబు స్క్వాడ్స్ టీమ్‌లు తనిఖీలు చేపట్టారు. అయితే విమానంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు.. అలాగే విమానం భద్రతా ప్రొటోకాల్స్‌ అన్ని విధాలుగా సరిపోయాయి. ఈ బాంబు బెదిరింపు కారణంగా.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి రాత్రి 8.55 గంటలకు ఢిల్లీ బయలుదేరాల్సిన విమానం అర్ధరాత్రి తర్వాత బయలుదేరడానికి అనుమతించారు. అయితే ఈ అనుమానాస్పద బాంబు బెదిరింపులకు పాల్పడి, తప్పుడు సందేశం ఇచ్చిన ప్రయాణికుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుతో పాటుగా మరికొన్ని నగరాలకు విమానాల రాకపోకలు జరుగుతుంటాయి. అయితే ఓ ప్రయాణికుడు చేసిన ఈ ఫేక్ ఫోన్ కాల్‌తో.. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన మిగిలిన ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. వారు సమయానికి ఢిల్లీ చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆకతాయి చేసిన పనికి అటు ప్రయాణికులు, ఇటు ఎయిర్‌పోర్టు సిబ్బంది భయంతో వణికిపోవాల్సి వచ్చింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ప్రయాణికులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button