Uncategorized

ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. 53 లక్షల కుటుంబాలకు లబ్ధి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కేంద్రం అదనంగా ఆరున్నర కోట్ల పనిదినాలు కేటాయించిదని డిప్యూటీ సీఎం ట్వీ్ట్ చేశారు. ఫలితంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పనిదినాలుు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన పని దినాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు మరికొన్ని రోజులు ఉపాధి దొరుకుతుంది.

గ్రామాల్లో పేదరికం నిర్మూలించేందుకు, ఉపాధి కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించిన ఈ పథకాన్ని.. ఎన్డీఏ సర్కారు కూడా కొనసాగిస్తూ వస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా కేంద్రం రాష్ట్రాల వారీగా పనిదినాలు కేటాయిస్తుంది. ఈ రకంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కూడా 15 కోట్ల పనిదినాలు కేటాయించారు. అయితే ఇలా కేటాయించిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తయినట్లు సమాచారం. దీంతో పనిదినాలను పెంచాలంటూ ఏపీ ప్రభుత్వం.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపింది.

ఈ ప్రతిపాదనలపై చర్చించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి.. ఏపీకి అదనంగా మరో ఆరున్నర కోట్ల పనిదినాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పనిదినాల పెంపువలన ఏపీలోని 53 లక్షల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని.. ప్రయోజనం చేకూరుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా త్వరగా విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అదనపు పని దినాలు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్రానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button