Uncategorized

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా, ఉండదా?.. ఒక్కమాటలో తేల్చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? లేదా?. కొద్దిరోజులుగా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్‌ గొప్పగా చెప్పుకొనే వాలంటీర్ల పదవీకాలం ఏడాది కిందటే ముగిసింది అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లతో ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని.. ఎన్నికలకు ముందు తాత్కాలికంగా 3 నెలల జీతాలను చెల్లించినట్లు వివరించారు. ఎన్నికలకు ముందు కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారని.. మిగిలినవారి పదవీకాలం ముగిసింది అన్నారు.

వాలంటీర్ల పదవీకాలం రెన్యువల్ చేయలేదని.. వాళ్ల జీతాల బిల్లులు కూడా లేవన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారని.. కానీ ‘మనం’ 3 నెలల జీతం ఇచ్చామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లు లేకుండా పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమని వైఎస్సార్‌సీపీ చెప్పిందని.. కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఒకేరోజు రికార్డుస్థాయిలో పింఛన్ల పంపిణీ పూర్తిచేశామన్నారు. ప్రతినెలా ఒకటో తేదీ పేదల సేవ పేరుతో పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యం కావాలన్నారు చంద్రబాబు.

అలాగే ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్లపై చర్చ జరిగింది. 2023 ఆగస్టుతోనే గ్రామ, వార్డు వాలంటీర్ల గడువు ముగిసిందని.. జగన్‌ ప్రభుత్వం వారి సేవల్ని పునరుద్ధరించలేదని భేటీలో మంత్రివర్గం పేర్కొంది. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా?.. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పుడున్నదాన్ని ఎలా క్రమబద్ధీకరించాలి వంటి అంశాల్ని కేబినెట్ ఎజెండాలో చేర్చారు. అలాగే రాజీనామాలు చేయని వాలంటీర్లకు ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.. మూడు నెలలు (జులై, ఆగస్టు, సెప్టెంబరు) నెలలకు వేతనం చెల్లించే అంశాన్ని ఆమోదం కోసం తీసుకొచ్చారు. గత ఆగస్టు నుంచి వారి సేవల్ని పునరుద్ధరించలేదని అధికారులు కేబినెట్‌కు వివరించారు. దీంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని.. వాలంటీర్ల వ్యవస్థపై లోతుగా పరిశీలించి, చర్చించాక ఒక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. జగన్‌ తప్పుడు విధానాల్లో పరిపాలన సాగించారనడానికి ఇదో ఉదాహరణని మంత్రులు వ్యాఖ్యానించారు.

ఏపీ కేబినెట్‌లో వాలంటీర్ల వ్యవస్థ అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు మంత్రి పార్థసారథి. వాలంటీర్ల సర్వీసును 2023 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 15 వరకు పొడిగించాలనే ప్రతిపాదనను కేబినెట్ తిరస్కరించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ శాఖలను ఇంటిగ్రేట్‌ చేస్తూ అమలుపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారన్నారు. ఈ నివేదిక అందిన తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో.. వాలంటీర్ల మీదనే పాలన నడుస్తోందనే విధంగా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రచారం చేశారని.. పార్టీ కార్యకర్తల కంటే కూడా వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారనేలా వ్యవహరించారన్నారు. కానీ 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల సర్వీసును పొడిగించకుండా గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అందుకే చంద్రబాబు ఇంటిగ్రేటెడ్‌ పాలసీ తీసుకురమ్మని చెప్పారని.. వాలంటీర్ల సేవల్ని వినియోగించుకుంటారనే తాము భావిస్తున్నామన్నారు. మొత్తం మీద ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థన ఉంటుందని చెబుతూనే.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button