Uncategorized

వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. పిన్నెల్లికి మరోసారి ఆ బాధ్యతలు, వరుసగా రెండోసారి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధినేత వైఎస్ జగన్. ఈ మేరకు జిల్లాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు.. జిల్లాలవారీగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో జైలుకు వెళ్లి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి అధినేత జగన్ కీలక బాధత్యలు అప్పగించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. అంతకముందు కూడా పిన్నెల్లి ఆ బాధ్యతల్లో ఉన్నారు.. ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జగన్‌ మళ్లీ నియమించారు.

వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో పల్నాడు, పశ్చిమ గోదావరి, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నేతలతో సమావేశమై ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాదరాజును, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నియమించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ మేకా శేషుబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

అంతేకాదు గత ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ను సొంత ప్రాంతమైన నెల్లూరు కార్పొరేషన్‌ పార్టీ పరిశీలకుడిగా నియమించారు. అంతేకాదు నెల్లూరుకు చెందిన మహ్మద్‌ ఖలీల్‌ అహ్మద్‌ను మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈయన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి మంత్రి నారాయణ చేతిలో ఓడిపోయారు. అలాగే నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా ఎ.ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ని నియమించారు. అలాగే నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డిని నియమించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button