Uncategorized

తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం వేళ కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం

తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని, జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలకు కేవలం ప్యూర్ నందినీ నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాలు, ఇతర పదార్థాల తయారీకి నాణ్యమైన నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆ రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను తరచూ పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు.. రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల్లోని ప్రసాదాల తయారీలో నాణ్యతను పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ నోటిఫై చేసిన అన్ని ఆలయాల్లో తయారు చేసే అన్ని ప్రసాదాలు, దీపాలు, ఇతర సేవలకు కేవలం నందినీ నెయ్యిని వాడటాన్ని తప్పనిసరి చేసింది.

ఇక ఈ తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయం కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరడంతో సీరియస్ అయింది. ఈ కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు వీలుగా పూర్తి నివేదికను కేంద్రానికి అందించాలని జేపీ నడ్డా.. చంద్రబాబును కోరారు. రాష్ట్ర నియంత్రణ అధికారులతో మాట్లాడి కేంద్రం దర్యాప్తు చేస్తుందని.. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button