Uncategorized

జగన్‌కు తలనొప్పిలా మారిన మంత్రి నారాయణ పెట్టిన కేసు.. మరోసారి హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువునష్టం కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా.. రాజధాని అమరావతి భూముల విషయంలో సాక్షి పత్రికలో వార్తను ప్రచురించారని అప్పటి మంత్రి నారాయణ.. 2018లో విజయవాడలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు పలుమార్లు జగన్‌కు సమన్లు జారీ చేయగా.. ఆయన కోర్టుకు హాజరుకాలేదని చెబుతున్నారు. తాజాగా పాస్‌పోర్ట్‌ జారీకి ఎన్వోసీ విషయంలో విజయవాడ ప్రత్యేక కోర్టు పూచీకత్తు సమర్పించాలని జగన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే.ఆ షరతులను సవాలు చేస్తూ జగన్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపించారు. విజయవాడ కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినా జగన్‌ వాటిని తీసుకోలేదని.. అలాగే విచారణను ఆలస్యం చేస్తున్నారన్నారు. తాజాగా విజయవాడ కోర్టు జగన్‌కు మరోసారి సమన్లు జారీ చేసిందని.. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసిందని కూడా ప్రస్తావించారు. దీంతో విజయవాడ కోర్టులో తనపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టేయాలని జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ సోమవారం విచారణ చేయనున్నారు.

ఇటీవల జగన్ పాస్ట్‌పోర్టు రెన్యువల్‌ విషయంలో విజయవాడ ప్రత్యేక కోర్టులో ఉన్న కేసు ఇబ్బందిగా మారింది. జగన్‌ ప్రత్యేక కోర్టు షరుతులు, పాస్‌పోర్ట్‌ను ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేస్తామనడంపై హైకోర్టులో సవాల్ చేశారు. అయితే కోర్టు పాస్‌పోర్ట్‌ను ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని.. అయితే విజయవాడ స్పెషల్ కోర్టు షరతులు మాత్రం వర్తిస్తాయని హైకోర్టు తెలిపింది. జగన్ విజయవాడ స్పెషల్ కోర్టుకు రూ.20వేలు పూచీకత్తు చెల్లించాల్సిందేనని తెలిపింది. ఈ పరిణామాలతో జగన్ ఈ కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. మరి కోర్టు సోమవారం జరిగే విచారణలో న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button