Uncategorized

టీటీడీ ఈవోతో కేఎంఎఫ్ (నందిని డెయిరీ) ప్రతినిధుల భేటీ.. ఎందుకంటే!

టీటీడీ ఈవో జే శ్యామలరావును కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డైరీ) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో కేఎంఎఫ్ ప్రతినిధులు నందిని డైరీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో గౌతమి, కేఎంఎఫ్ ఎండి ఎంకె జగదీష్, డైరెక్టర్లు రఘునందన్, రాజశేఖర్ మూర్తి, మంజునాథ్ పాల్గొన్నారు. ప్రధానంగా నెయ్యి నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలు, దేశంలో ఎక్కడెక్కడకు పాలు, నెయ్యి సరఫరా చేస్తున్నారనే అంశాలను వివరించారు. అలాగే మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పాలను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ, ప్రసాదాలు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని.. నెయ్యి నాణ్యతలో ఎలాంటి తప్పులు జరగకూడదని వారికి ఈవో తెలిపారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియలో పాల్గొంటూ టీటీడీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేయాలని కోరారు.

తిరుమల శ్రీవారి ప్రసాదాల కోసం 20 ఏళ్లుగా స్వచ్ఛమైన నందిని నెయ్యి వాడేవారు. కానీ గత ప్రభుత్వం 2023లో ధరల కారణంగా నందిని నెయ్యి సరఫరాను నిలిపివేసింది. 2022-23 టీటీడీ టెండర్‌లో కేఎంఎఫ్ కిలో నెయ్యి ధర రూ.450గా నిర్ణయించి టెండర్ వేసింది. అయితే టెండర్‌లో, ఇతర కంపెనీలు KMF కంటే తక్కువ బిడ్ వేయడంతో.. నందిని నెయ్యి బదులు టీటీడీ తక్కువ ధర వేసిన మరో కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసింది. దీంతో 2023 నుంచి కేఎంఎఫ్ నుంచి నందిని నెయ్యి కొనుగోలును టీటీడీ నిలిపివేసింది.

నందిని టీటీడీకి 2013-14 నుంచి 2021-22 వరకు 5 వేల టన్నుల నెయ్యిని కేఎంఎఫ్ సరఫరా చేసింది. 2022-23లో కేఎంఎఫ్ నెయ్యిని సరఫరా చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరానికి సంబంధించి టీటీడీకి 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేయాలని ఆర్డర్‌ ఇచ్చారు. కిలో నందిని నెయ్యిని రూ.478 చొప్పున టీటీడీ KMF నుంచి నందిని నెయ్యిని కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు మళ్లీ తిరుమల లడ్డూకు నందిని నెయ్యి సరఫరా అవుతోంది. ఇప్పటికే కొన్ని ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయి. అలాగే తిరుమలకు పంపించే నెయ్యినెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో అన్ని ఆలయాాల్లో ప్రసాదాల తయారీ, ఇతర అవసరాలకు నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button