Reliance : రిలయన్స్ జియో సంచలనం.. కేవలం రూ.1099 ధరకే.. JioBharat V3 V4 ఫోన్లు.. స్మార్ట్ఫోన్లకు ఏమాత్రం తీసిపోని ఫీచర్లు!
JioBharat V3 V4 phones launch: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) మరో రెండు కొత్త 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. మొబైల్ కాంగ్రెస్ 2024లో జియో భారత్ వీ3, వీ4 పేరిట వీటిని భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. సరసమైన ధరకు 4 జీ కనెక్టివిటీని అందించే ఈ రెండు ఫోన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. రూ.1,099 ప్రారంభ ధరతో జియోభారత్ V3, V4 మోడళ్లను విడుదల చేసింది. భారత్లో 2జీ నెట్ వర్క్పై ఉన్న కోట్లాది మంది యూజర్లకు చౌకైన 4జీ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఈ రెండు మోడళ్లను లాంచ్ చేశారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, డిజిటల్ సేవలను విస్తరించడం లక్ష్యంగా ఈ రెండు మోడల్స్ రిలయన్స్ (Reliance) జియో లాంచ్ చేసింది.
జియోభారత్ వీ3 స్టైల్, లుక్స్, యుటిలిటీలకు ప్రాధాన్యమిస్తుంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఉండే ఫోన్ కోసం ప్రయత్నిస్తున్న ఆధునిక వినియోగదారులకు ఇది సరైన ఎంపిక అని జియో చెబుతోంది. ఇదిలా ఉంటే.. జియోభారత్ వి4 డిజైన్ చాలా సరళంగా ఉంటుంది. ఈ మోడళ్లు సరసమైన ధరకు వినియోగదారులకు ప్రీమియం సేవలు అందిస్తాయి. ఈ రెండూ మోడళ్లు కూడా వినియోగదారులకు అన్ని రకాల డిజిటల్ సేవలను అందిస్తాయి. ఇందులోని జియో టీవీ ద్వారా 455 లైవ్ టీవీ ఛానళ్లు వీక్షించవచ్చు. వినియోగదారులు తమకు ఇష్టమైన షోలు, వార్తలు, క్రీడలను ఆస్వాదించవచ్చు. ఈ మోడల్స్లో ఉన్న జియోసినిమా యాప్లో సినిమాలు, వీడియోలు చూడవచ్చు. ఇంకా మీకిష్టమైన కార్యక్రమాలు, వార్తా చానళ్లు, క్రీడలు, సినిమాలు వీటిలో అందుబాటులో ఉంటాయి.