Uncategorized

రైలుకు బ్రేకులు వేసి 60 ఏనుగుల ప్రాణాలు కాపాడారు.. హ్యాట్సాఫ్ ఇండియన్ రైల్వే

రైలుకు అడ్డంగా వస్తే ఏదైనా మటాషే. రైల్వే ట్రాకులను దాటే క్రమంలో వన్యప్రాణులు తరచూ మృత్యువాతపడుతున్నాయి. అయితే, అస్సాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం మిమ్మల్ని ఎంతగానో కదిలిస్తుంది. లోకో పైలట్ తీసుకున్న నిర్ణయం 60 ఏనుగుల ప్రాణాలను కాపాడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే సేఫ్టీ సిస్టమ్ ఇందుకు సహకరించింది. రాత్రివేళలో ఒక ఏనుగుల గుంపు.. రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా AI సేఫ్టీ సిస్టమ్ అలెర్ట్ చేయడంతో అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపేశారు. అస్సాంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కామ్‌రూప్ ఎక్స్‌ప్రెస్ రైలు అక్టోబర్ 16న గౌహతి నుంచి లుండింగ్ వెళ్తోంది. రాత్రి 8.30 గంటల సమయంలో హవాయిపూర్, లంసఖండ్ స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తోంది. చిమ్మచీకటిలో రైల్వే ట్రాక్ పక్కన ఒక ఏనుగుల గుంపును ట్రైన్ డ్రైవర్ జేడీ దాస్, ఆయన అసిస్టెంట్ ఉమేష్ కుమార్ గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో ఏనుగులకు కాస్త దూరంలో రైలు ఆగింది. ఆ తర్వాత 60 అడవి ఏనుగులు ట్రాక్ దాటాయి. ఏనుగులు ట్రాక్ దాటుతుండగా అసిస్టెంట్ లోకో పైలట్ తన స్మార్ట్‌ ఫోన్‌తో వీడియో తీశారు.

చిమ్మ చీకటిలో వేగంగా వెళ్తున్న రైలులో నుంచి లోకో పైలట్లు ఏనుగులను గమనించడానికి కారణం AI బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఈ సేఫ్టీ సిస్టమ్ ముందుగా అలెర్ట్ ఇవ్వడంతో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించారు. ఆ తర్వాత ఏనుగులను చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు.

అస్సాంలో ఏనుగులు రాత్రివేళల్లో ఎక్కువగా రైల్వే ట్రాకులు దాటుతుంటాయి. వాటిని గుర్తించేందుకు ఇటీవల ఇండియన్ రైల్వేస్ పలు లైన్లలో AI ఆధారిత సేఫ్టీ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఈ లైన్‌లో కూడా ట్రాక్‌లకు ఈ సేఫ్టీ సిస్టమ్‌ను అనుసంధానం చేయడంతో పదుల సంఖ్యలో ఏనుగులు ప్రాణాలతో బయటపడ్డాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button