Uncategorized

నువ్వు దేవుడివి సామీ..పేదింటి అమ్మాయికి కంటి చూపు ప్రసాదించిన సోనూసూద్

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం చేశాడు. రోజువారీ కూలీలను తన సొంత డబ్బులతో స్వస్థలాలకు పంపించాడు. రోడ్డుపైనే బతుకీడుస్తోన్న నిరాశ్రయుల కడుపు నింపి రియల్ హీరోగా మన్ననలు అందుకున్నాడు.

కరోనా తర్వాత కూడా సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడీ రియల్ హీరో. ఇప్పటికే లెక్కలేనంత మందికి ఆపన్న హస్తం అందించి మన్ననలు అందుకున్న సోనూసూద్ ఇప్పుడు ఓ అమ్మాయికి కంటి చూపు ప్రసాదించాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కోపర్‌గావ్ పట్టణానికి చెందిన గాయత్రి థోరట్ అనే బాలిక చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోయింది. రెండున్నరేళ్ల వయసులో ఎడమ కంటిలో ప్రమాదవశాత్తూ సున్నం పడడంతో దృష్టి కోల్పోయింది. కేవలం కుడి కన్నుతోనే అన్ని పనులు చేసుకునేది జీవితాంతం ఇలాగే ఉండాల్సి వస్తుందని పశ్చాత్తాపపడుతున్న సమయంలో సోనూ సుద్ సాయం చేసేందుకు వచ్చాడు. గాయత్రికి కంటి చూపు తిరిగి తెప్పించడానికి ఆమె తండ్రి దశరథ్, సోదరుడు కార్తీక్ థోరట్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ శస్త్రచికిత్స కోసం లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. పేదింటి కుటుంబం కావడంతో గాయత్రికి కంటి చికిత్స ఆగిపోయింది.

అదే సమయంలో కోపర్‌గావ్‌కు చెందిన సామాజిక కార్యకర్త వినోద్ రక్షే గాయత్రి విషయాన్ని సోనూసూద్ దగ్గరకు తీసుకెళ్లాడు. స్పందించిన నటులు వెంటనే పేదింటి బాలిక కంటి శస్త్ర చికిత్స కోసం అవసరమైన సాయం చేశాడు. ఫలితంగా ఇప్పుడు గాయత్రి ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తూ తెగ ఆనందపడిపోతోంది. శస్త్రచికిత్స తర్వాత కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత గాయత్రి సోనూ సూద్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

‘ సోనూ సూద్ సార్ నాకు కంటి చూపు ప్రసాదించారు. ఆయన చేసిన సహాయం ఎన్నటికీ మరువలేనిది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కృతజ్ఞతలు చెప్పడానికి నా పదాలు సరిపోవు. దేవుడు సోనూ సార్ ను చల్లగా చూడాలి’ అని కోరుకుంటోంది గాయత్రి. ఈ క్రమంలోనే పేదింటి అమ్మాయికి కంటి చూపు తెప్పించిన సోనూ సూద్ పై ప్రతిచోటా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button