Uncategorized

Odisha: గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించి.. అమానుషం

ఓ గిరిజన మహిళపై దాడిచేసి.. ఆమెతో బలవంతంగా మానవ మలం తినిపించిన అత్యంత హేయమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలన్‌గిర్ జిల్లా బంగముండా పోలీస్ స్టేషన్ పరిధిలోని జురాబంధ్ గ్రామంలో నవంబరు 16న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. బాధిత మహిళకు చెందిన వ్యవసాయ భూమి మీదుగా నిందితుడు ట్రాక్టర్ నడుపుతూ పంటకు నష్టం కలిగించడంతో ఆమె నిలదీసింది. ఈ క్రమంలో అతడితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆమెపై నిందితులు దాడి చేసి నోటిలో బలవంతంగా మానవ మలాన్ని కుక్కారు. వారి నుంచి రక్షించడానికి మహిళ బంధువు ఒకరు ప్రయత్నించగా.. ఆమెపై కూడా నిందితులు దాడిచేశారు.

దాడికి పాల్పడిన నిందితులను గిరిజనేతరులుగా పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారు. గిరిజన మహిళపై దాడి ఘటన ఒడిశాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీజేడీ ఎంపీ నిరంజన్ బిసి మీడియాతో మాట్లాడుతూ… నిందితుడిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. బంగముండాలో శాంతి భద్రతలు సమస్య తలెత్తితే దానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని ఆయన హెచ్చరించారు.

మరోవైపు, బొలన్‌గిరి ఎస్పీ కిలారి రిషికేశ్ ద్యాన్‌దియో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళపై దాడి ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని వివరించారు. ‘గిరిజన మహిళపై దాడిచేసిన నిందితుడు పరారీలో ఉన్నాడు.. అతడ్ని పట్టుకోడానికి రెండు బృందాలను ఏర్పాటుచేశాం.. అంతేకాదు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా పోలీసులను పంపి గాలిస్తున్నాం’ అని చెప్పారు. ఎక్కడ ఉన్నా తప్పించుకోలేడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ స్ఫష్టం చేశారు. ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్టు మరో పోలీస్ అధికారి తెలిపారు. కాగా, దేశంలో ఇటువంటి ఘటనలు ఏదో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో అమాయక గిరిజనులపై పలువురు దారుణాలకు పాల్పడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button