Uncategorized

టెన్త్‌ విద్యార్ధులకు అత్యధిక మార్కులు వచ్చేలా.. వంద రోజుల ప్రణాళిక అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు మార్చి నెలలో జరగనున్న పబ్లిక్ పరీక్షల కోసం సర్కార్ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. పరీక్షల్లో విద్యార్ధులు అత్యుత్తమ మార్కులు సాధించేలా అదనపు తరగతులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధుల్లో పదో తరగతి పరీక్షల భయం మొదలైంది. ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు చదువుకుంటే సులభంగా పరీక్షలు రాయవచ్చు. అయితే గత మూడేళ్లలో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని కూటమి ప్రభుత్వం అంటోంది. దీంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేలా వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. డిసెంబరు 2 నుంచి ఇది అమలవుతోంది.

ఇందులో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 2 వేల మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఫలితాలు మెరుగ్గా సాధించేందుకు ఇక్కడి స్కూళ్లలోని ప్రతి ఉపాధ్యాయుడు 5 నుంచి 8 మంది విద్యార్థులను దత్తత తీసుకుంటున్నారు. వారికి సబ్జెక్టుల వారీగా మెలకువలు నేర్పించడం, అత్యధిక మార్కులు సాధించేందుకు ప్రేరణ కలిగిస్తున్నారు. గతంలో ఒక్కో పీరియడ్‌ 45 నిమిషాలు ఉండగా.. ప్రస్తుతం ఈ ప్రణాళికలో 90 నిమిషాల వరకు పెంచారు. ప్రతి సబ్జెక్టుపై పాఠ్యాంశాల వారీగా తర్ఫీదు ఇవ్వాలనే లక్ష్యంతో సమయాన్ని పెంచారు.

విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ.. ప్రిపరేషన్‌ సాగేలా కృషి చేస్తారు. ఉదయం 8 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు కూడా అదనపు పీరియడ్‌లు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టులో విద్యార్థులకు పరీక్షలు జరిపి, మార్కులను సమీక్షిస్తున్నారు. ఇలా ప్రతి విద్యార్థి అత్యధిక మార్కులు సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ప్రత్తిపాడు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button