Uncategorized

ఈడీ ముందుకు నటుడు ప్రకాశ్‌రాజ్‌… బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో విచారణకు హాజరు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో వదల బొమ్మాళీ అంటూ ఈడీ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా విచారణకు రావాలంటూ, రానా, ప్రకాష్‌రాజ్‌, మంచులక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఈడీ ముందు హాజరయ్యారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఈడీ ఫోకస్‌ చేసింది. మొత్తం 36 బెట్టింగ్‌ యాప్స్‌కి సంబంధించిన ప్రమోషన్స్‌పై సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఓ బెట్టింగ్‌ యాడ్ ప్రమోషన్‌లో ప్రకాష్‌రాజ్ నటించడంతో అతనిపైనా కేసు నమోదైంది. 10రోజులక్రితం నోటీసులు ఇవ్వడంతో ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు ప్రకాష్‌రాజ్.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌, మనీ లాండరింగ్‌ వ్యవహారాలకు సంబంధించిన దర్యాప్తును ఈడీ అధికారులు స్పీడప్‌ చేశారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసుకు సంబంధించి, విచారణకు హాజరు కావాలని టాలీవుడ్‌ ప్రముఖ నటీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని దగ్గుబాటి రానాను ఆదేశించింది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని ప్రకాష్‌రాజ్‌కు, ఆగస్టు 13న ఎంక్వైరీకి రావాలని మంచులక్ష్మికి నోటీసులు జారీ చేసింది.

బెట్టింగ్ యాప్‌లతో జరిగిన అగ్రిమెంట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని రావాలని టాలీవుడ్‌ సెలబ్రిటీలను ఆదేశించింది. ఇక ఇదే కేసులో పేర్లున్న మిగతా నటీనటులకు సైతం దశలవారీగా సమన్లు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది నటీనటులతో పాటు కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సలర్లపై విచారణ జరుగుతోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్‌, సైబరాబాద్‌, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన FIRల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది.

బెట్టింగ్స్‌ యాప్స్‌ వల్ల తెలంగాణ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ యాప్స్‌ను విచ్చలవిడిగా ప్రమోట్‌ చేయడంతో.. ప్రజలు కూడా ఆకర్షితులై.. వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయారు. కొందరు లక్షలాది రూపాయలు కోల్పోయారు. దీంతో బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారంలో ప్రమోటర్స్‌గా ఉన్న సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ECIR నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోటింగ్ చేసినందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడీ గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు సాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button