Uncategorized

శ్రీశైలంలో కలకలం.. రాత్రివేళ కొండ పై నుంచి దూకిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ సమీపంలోని కొండపై నుంచి దూకి బుర్రె వెన్నెల అనే యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి వెన్నెల ఆన్లైన్ లోన్ యాప్ వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి ఆత్మహత్యాయత్నం కోసం నిన్న రాత్రి శిఖరం వద్ద చేరుకుంది. కొండపై నుంచి సుమారు 20 అడుగుల లోతులోకి దూకడంతో పక్కనే ఉన్న భక్తులు వెంటనే స్పందించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం సీఐ ప్రసాదరావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకొని లోయలోకి దూకిన యువతి కోసం గాలింపు చేపట్టారు. అయితే యువతి ఎండకు కనపడకపోవడంతో తిరిగి ఈరోజు తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు. యువతిని కనిపెట్టి.. చిన్న చిన్న గాయాలతో ఉన్న యువతిని శ్రీశైల దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేయించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

సిఐ తెలిపిన వివరాల మేరకు యువతి వెన్నెల గుంటూరు జిల్లా తెనాలి కొలకలూరు గ్రామానికి చెందింది. ఇటీవల ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా యువతి తల్లికి బాగోలేదనే కారణంతో 15 వేలు లోన్ తీసుకోగా దానికి 5 రెట్లు డబ్బులు చెల్లించినట్లు చెప్పింది. అయినా ఇంకా ఇంకా డబ్బుల కోసం వేధించడమే కాదు.. యువతి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఆన్లైన్లో పెడతామని చెప్పడంతో యువతి మనస్థాపానికి గురైంది. దీంతో శ్రీశైలం వచ్చి కొండపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలిపారు. యువతిని ప్రాణాపాయం నుంచి కాపాడిన శ్రీశైలం సిఐ ప్రసాదరావు.. యువతి కుటుంబ సభ్యులకు అదే విధంగా తెనాలిలో మిస్సింగ్ కేసు నమోదైన విషయం తెలిసి అక్కడ పోలీసులకు కూడా విషయం తెలియజేశారు. వెన్నెలను ఆమె అక్కకు అప్పగించారు. లోన్ యాప్స్ సైబర్ నేరాల దృష్ట్యా జాగ్రత్త వహించాలని అప్రమత్తంగా ఉండాలని సిఐ ప్రసాదరావు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button