Uncategorized

శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు.. కృష్ణమ్మకు ముఖ్యమంత్రి జలహారతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వచ్చారు.. అక్కడ చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

అనంతరం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకోగా.. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రత్యేక పూజలు చేసి.. జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లారు.. మడకశిర మండలంలో గుండమలలో పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది.. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా.. జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.50 అడుగులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.. ఆ తర్వాత 60 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 25 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టును చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. వ్యూ పాయింట్, ఆనకట్ట వద్ద నీటిని చూస్తూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button