బిజినెస్

యూపీఐ చెల్లింపులపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఆ లిమిట్ రూ. 5 లక్షలకు పెంపు.. చెక్ క్లియరెన్స్ గంటల్లోనే!

RBI Governor Cheques Clearance: ఈసారి కూడా అందరి అంచనాలకు అనుగుణంగానే.. అంతా ఊహించినట్లుగానే రెపో రేట్లను మార్చలేదు. దీంతో వరుసగా 9వ సారి కూడా ఈ రేట్లను యథాతథంగానే ఉంచింది. మంగళవారం ప్రారంభమైన మానిటరీ పాలసీ సమావేశం నిర్ణయాల్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ వడ్డీ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయట్లేదు. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం.. ఏప్రిల్, మే లో స్థిరంగా ఉండగా.. జూన్ నెలలో పెరిగిందని చెప్పారు. ఆహార పదార్థాలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.20 శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు.

ఆర్బీఐ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే టాక్స్ పేమెంట్లపై యూపీఐ లిమిట్‌‌ను పెంచుతున్నట్లు దాస్ ప్రకటించారు. అంతకుముందు యూపీఐ టాక్స్ పేమెంట్స్ పరిమితి రూ. లక్షగానే ఉండగానే.. ఇప్పుడు దీనిని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఎక్కువ టాక్స్ చెల్లించేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ. 5 లక్షల వరకు యూపీఐతోనే టాక్స్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపారు.

యూపీఐతో చేసే చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. ఇదే డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో చేసినప్పుడు మారుతుంది. అంటే అక్కడ ఇలా పేమెంట్స్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ ఈ పరిమితి పెంచడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు 2023 డిసెంబర్‌లోనే ఆర్బీఐ.. హాస్పిటల్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి వాటికి చేసే యూపీఐ పేమెంట్ లిమిట్‌ను రూ. 5 లక్షలకు పెంచింది. ఇప్పుడు పన్ను చెల్లింపుల పరిమితిని కూడా పెంచేసింది. సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ మాత్రం గరిష్టంగా రూ. లక్షగానే ఉంది.

ఇదే సమయంలో చెక్ క్లియరెన్స్‌పైనా ఆర్బీఐ గవర్నర్ దాస్ కీలక ప్రకటన చేశారు. చెక్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని.. ఇది గంటల్లోనే పూర్తి కావాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2 నుంచి 3 రోజుల వరకు పడుతుంది. ఇది చెల్లింపుదారుకు సహా చెల్లింపుస్వీకర్తకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. దీనిని వేగవంతం చేసేందుకు నిరంతర చెక్ క్లియరింగ్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు ఆర్బీఐ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ప్రకటనకు ముందు ఒడుదొడుకుల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు తర్వాత కోలుకున్నాయి. ఈ వార్త రాసే సమయంలో సెన్సెక్స్ 80, నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button