Uncategorized

లెక్క మారింది.. ఆ బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదే.. సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..

నీట ముంచినా.. పాల ముంచినా మంత్రులదే బాధ్యత.! ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క. పరిస్థితిని సీరియస్‌గా తీసుకోకుంటే ఏ పరిణామాలకైనా బాధ్యత వహించాల్సిందే. ఇదీ క్లుప్తంగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్వీట్‌ వార్నింగ్‌. అలాగే గట్టుదాటిన పార్టీ నేతలను కూడా ఇకపై ఉపేక్షించేంది లేదని హెచ్చరికలు జారీ చేశారు.

18 నెలల పాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..స్థానిక ఎన్నికల రూపంలో త్వరలో అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది. దీంతో పరిపాలన వ్యవస్థను సెట్‌రైట్‌ చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటికే మూడు కేబినెట్‌ బెర్త్‌లను భర్తీ చేయడంతో పాటు కీలకమైన పీసీసీ పోస్టులను కూడా ఫిల్‌ చేశారు. ఇదే క్రమంలో గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వాటిపై దృష్టిపెట్టడం లేదన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదేనని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవులు భర్తీపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు.. ఇందిరమ్మ పాలన విజయాలను జనాల్లోకి తీసుకెళ్లాలని పీఏసీ నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

గాంధీభవన్‌లో ధర్నాలు చేయవద్దని నేతలకు వార్నింగ్‌

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ అంశాలపై పెద్దగా మాట్లాడని రేవంత్‌రెడ్డి.. పీఏసీలో పార్టీ నేతలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. గాంధీభవన్‌లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప.. గొడవలు, ధర్నాలు చేస్తే సీరియస్‌ యాక్షన్ ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. పదవులు అడగడం తప్పులేదు కానీ మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయించడమేంటని మండిపడ్డారు. పార్టీలో క్రమ శిక్షణ ముఖ్యమని తేల్చిచెప్పారు. పీసీసీ కార్యవర్గంలో అందరికీ పని అప్పగించాలని నిర్దేశించారు. పనిచేసేవాళ్లది ఓ జాబితా..చేయనివాళ్లది మరో జాబితా ఉంటుందన్న ముఖ్యమంత్రి..పనిచేస్తే ప్రమోషన్‌ లేకపోతే డిమోషన్‌ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మొహమాటం ఉండదన్నారు.

మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా పని చేయాలని నేతలకు సూచించారు రేవంత్‌రెడ్డి. బూత్‌, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని మంత్రులు, పార్టీనేతలకు నిర్దేశించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం ప్రకటిస్తుందని.. నేతలు ఎవరికి వారే తానే అభ్యర్థిని అని చెప్పుకోవద్దని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button