Uncategorized

చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!

ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఓ వృద్ధ ప్రయాణీకుడిపై మహిళా కండక్టరు దాడి చేసిన సంఘటన గురువారం తోట్లవల్లూరు మండలం కనకదుర్గ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తోట్లవల్లూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్‌కు రూ.200 నోటు ఇవ్వగా.. పెద్ద నోటు ఇస్తే ఎట్లా? అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై.. ఘర్షణ తలెత్తింది.

వివాదం పెద్దది కావడంతో కనకదుర్గ కాలనీ వద్ద మహిళా కండక్టర్ వృద్ధుడిని బస్సు దింపేసి.. అతడిపై దాడి చేసింది. ఈ ఘటనను వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ది వైరల్ అయింది. మహిళా కండక్టర్ గతంలోనూ ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది.

తాజా ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. ఉయ్యూరు డిపో ఇన్‌ఛార్జి డీఎం పెద్దిరాజు స్పందిస్తూ.. ఘటనపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని.. బాద్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికుడిపై దాడిని ఖండించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button