Uncategorized

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ ఇళ్లు, ఇళ్ల స్థలాలపై ఎంక్వయిరీ..!

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై పునర్విచారణకు ఆదేశించింది. ఐదు రోజుల్లో సర్వే చేసి.. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆర్డర్స్‌ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.

గత వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది. దానిలో భాగంగా.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసింది. గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఐదు రోజుల పాటు రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక.. అందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారనే విషయంపై సర్వే చేయనున్నారు అధికారులు. ఇచ్చిన స్థలాల్లో ఎంతమందికి పట్టాలున్నాయనేది తేల్చనున్నారు. ప్రధానంగా అనర్హులను గుర్తించనున్నారు.

సర్వేకు సంబంధించిన ఓ చెక్‌ లిస్ట్‌ ఫార్మాట్‌ను కూడా జిల్లాల కలెక్టర్లకు పంపింది. దాంతో.. ఆయా అంశాల వారీగా సర్వే చేయనున్నారు రెవిన్యూ శాఖ అధికారులు. గతంలో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని, కొంతమంది ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని పెద్దయెత్తున ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. చాలా మంది పట్టాలు పొంది స్థలాల్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు ఉన్నాయి. దాంతో.. అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా… గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అధికారులు ఇచ్చే సర్వే రిపోర్ట్‌ అధారంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button