Uncategorized

డ్రైవరన్న జర భద్రం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆ జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం!

ఎక్కువగా రోడ్డుప్రమాదాలు రాత్రి పూటనే జరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం ఒకటి డ్రైవర్స్‌ నిద్రమత్తు, మరొకటి మద్యం సేవించి వాహనాలు నడపడం. చాలా వరకు నిద్రమత్తు కారణంగానే రాత్రి పూట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్టాప్, రీప్రెష్‌ అండ్‌ గో అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అసలేంటి ఈ స్టాప్, రీప్రెష్‌ అండ్‌ గో.. దీన్ని ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుందాం పదండి.

రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీసులు, పీఎస్‌ కమీషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాలలో ప్రధాన రహదారుల గుండా ప్రయాణించు వాహన డ్రైవర్లు నిద్రలేకుండా ఎక్కువ దూరాలకు ప్రయాణించడం వలన తెల్లవారు జామున అంటే 2 గంటల నుండి 5 గంటల ప్రాంతాలలో నిద్రలోకి జారుకోవడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారు, మరెన్నో కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో అనే ప్రథ్యేక కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజాము సమయంలో 02.00 గంటల నుండి 05.00 గంటల వ్యవధిలో పీఎస్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు డ్యూటీలు నిర్వహిస్తూ.. వచ్చిపోయే వాహనాలను ఆపి.. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లు రీఫ్రెష్ అయ్యేందుకు నీటిని అందిస్తున్నారు. దీంతో వారు రీఫ్రెష్ అయ్యి పూర్తి నిద్రమత్తు నుంచి తేరుకున్నాక వారిని తిరిగి పంపిస్తున్నారు. జిల్లాల్లోని మాచవరం మహానాడు రోడ్డు, సత్యనారాయణపురం శారదా కళాశాల సమీపంలో, భవానిపురం గొల్లపూడి హైవే సమీపంలలో, తిరువూరు హైవే సమీపంలో, జి. కొండూరు హైవే సమీపం లలో భవానిపురం హైవేల వద్ద పోలీసు అధికారులు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని వలన చాలా వరకు రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే విజయవాడ నేషనల్ హైవేతో పాటు సిటీ దాటిన తర్వాత కొన్ని టార్గెట్ ప్రాంతాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్, హెవీ వెహికిల్స్ వరకు చాలానే ఉన్నాయి. అయితే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న సమయం తెల్లవారుజామునే కావడంతో.. ప్రమాదాలకు గల కారణాలను పోలీసులు తెలుసుకున్నారు. వాటిని అదిగమించేందుకు ఈ వినూత్న కార్యక్రమంతో ప్రమాదాలకు చెక్ పెడుతున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో  డ్రైవర్లలో అవగాహనతో పాటు ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుంది స్థానికులు అంటున్నారు.  రాత్రిపూట ప్రయాణాలు చేసే డ్రైవర్లు కాస్త అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చుని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button