Uncategorized

నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వానపడుతోంది. న‌గ‌రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అబ్దుల్లాపూర్‌మేట్, జీడిమెట్ల‌, సూరారం, అబిడ్స్‌, నాంప‌ల్లి, నాగోల్‌, అంబ‌ర్ పేట్‌, సుచిత్ర, బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, షేక్ పేట, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఎర్రమంజిల్, లక్డికాపుల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

భారీ వర్షంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నగర వ్యాప్తంగా పలు కాలనీల్లో మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచింది. మరో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని పలువురు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని ఇటువంటి సమయంలో పిల్లల్ని బయటకు పంపలేమని చెబుతున్నారు. కాగా, స్కూళ్లు, కాలేజీలకు గత నాలుగు రోజులుగా సెలవులు వచ్చాయి. ఆగస్టు 17 శనివారం మినహా.. ఆగస్టు 15, 16, 18, 19 తేదీల్లో సెలువులు ఇచ్చారు. నేడు కూడా సెలవులు ఇస్తే గత వారంలో రోజుల్లో ఐదు రోజులు సెలవులు ఇచ్చినట్లు అవుతుంది.

ఇక భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. అలాగే ఉద‌యం కార్యాల‌యాల‌కు వెళ్లే ఉద్యోగులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్లపై భారీ వర్షం నీరు చేరటంతో ట్రాఫిక్‌లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక రోడ్లపై మ్యాన్ హోల్స్ మూతలు తెరిచే అస్కారం ఉందని.. రోడ్లపై వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరం అయితే జీహెచ్ఎంసీ అధికారుల సాయం తీసుకోవాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button