Uncategorized

అర్హులైనా రైతు రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ. పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

అయితే ఇప్పటి వరకు రెండు విడతల్లో రుణమాఫీ జరగ్గా.. కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు, ఆధార్ వివరాలు సరిపోలకపోవటం, వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. అర్హతలు ఉన్నా.. రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అటువంటి వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులెవరూ ఆధైర్యపడొద్దని.. ఆందోళనకు గురికావొద్దని సూచించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.

రుణమాఫీ, రైతుభరోసా పథకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను మంత్రి పొన్నం ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో హరీశ్‌ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపి 3 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమా అందక పరిహారం లేక చాలామంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు రుణమాఫీ జరగని వారు కాల్ చేయాలని ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టారని.. అదేదో అప్పుడే పెట్టి ఉంటే రైతులకు మేలు జరిగేదని సూచించారు. అప్పుడేమో కలెక్షన్‌ సెంటర్లు పెట్టి.. ఇప్పుడు మెుసలి కన్నీరు కారుస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button