Uncategorized

జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు.. కొనసాగుతున్న ఆపరేషన్

గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటం దేశం మొత్తం తీవ్ర ఆందోళనకరంగా మారాయి. సరిహద్దుల నుంచి దేశంలోని ఉగ్రవాదులు చొరబడటం, ఇక్కడ ఉన్న ఉగ్రవాద మద్దతుదారులు రెచ్చిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉగ్రవాద దాడులు రోజురోజుకూ పెరుగుతుండటం సంచలనంగా మారుతోంది. తాజాగా జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు గాయాల పాలయ్యారు.

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులకు గాయాలైనట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. కోకర్‌నాగ్ సబ్ డివిజన్ ప్రాంతంలో ఉన్న అడవుల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన సైనికులు.. ఆ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అహ్లాన్ గాడోల్‌ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి.. ఉగ్రవాదులు తారసపడ్డారు.

దీంతో సైనికులు, టెర్రరిస్ట్‌ల మధ్య ఎన్‌కౌంటర్ మొదలైనట్లు పోలీసులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్న వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులకు గాయాలు కావడంతో వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన పారాట్రూపర్లు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులను పట్టుకునేందుకు.. అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్‌లో కోకెర్‌నాగ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్‌లో పాల్గొన్న కమాండింగ్ ఆఫీసర్, మేజర్, డీఎస్పీ అమరులు అయ్యారు. దాదాపు ఏడాది తర్వాత ఇదే ప్రాంతంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అహ్లాన్ గాడోల్ అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు ఈ ప్రాంతానికి సైన్యాన్ని మోహరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button