Uncategorized

ఏపీలో మద్యం దుకాణాలు రద్దు.. చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం

AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటిని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాప్‌లను రద్దు చేస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాలను రద్దు చేస్తూ కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రిటైల్‌ లిక్కర్‌ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది.

వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త లిక్కర్‌ పాలసీ రానుంది. కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టేందుకు ఇటీవల సమావేశం అయిన ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నపుడు టీడీపీ హయాంలో వరకు అమలు అయిన పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్‌ వ్యాపారం మొత్తం ప్రైవేటు వారికే అప్పగించనున్నారు.

అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని రాష్ట్రంలో అమలు చేయనుండగా.. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ తీసుకువచ్చి ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3396 వైన్ షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. కొత్త మద్యం దుకాణాల్లో.. గీత కార్మికులకు 10 శాతం దుకాణాలు కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే 340 మద్యం షాపులను కల్లుగీత కార్మికులకు చంద్రబాబు సర్కార్ కేటాయించనుంది. మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button