Uncategorized

వైద్యురాలిపై హత్యాచారానికి ముందు ఏం జరిగింది? కీలక విషయాలు గుర్తించిన సీబీఐ

కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆమె సహచర వైద్యులను విచారిస్తోన్న సీబీఐ.. వారికి లై-డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వారు పొంతనలేని వాంగ్మూలాలు ఇవ్వడమే ఇందుకు కారణం. వీరిలో ఓ హౌస్ సర్జన్, ఓ ఇంటెర్న్, ఇద్దరు మొదటి సంవత్సరం పీజీ డాక్టర్లు ఉన్నారు. ఈ నేరంలో వీరి భాగస్వాములైనట్టు కనిపించడం లేదు, కానీ సాక్ష్యాలను తారుమారు చేయడంలో పాత్ర పోషించారా లేదా కుట్రలో భాగమా అని తెలుసుకోడానికే అని సీబీఐ వర్గాలు తెలిపాయి.

అలాగే, హత్యాచారం జరగడానికి ముందు రోజు రాత్రి జరిగిన సంఘటనల క్రమాన్ని కూడా పరిశోధకులు ఒకచోట చేర్చారు. సీబీఐ అనుమానిస్తోన్న నలుగురు తోటి వైద్యుల్లో ఇద్దరి వేలిముద్రలు.. మృతదేహం ఉన్న మూడో అంతస్తులోని సెమినార్ హాల్‌లో సీబీఐ గుర్తించింది. ఆ రోజు రాత్రి మొదటి అంతస్తు నుంచి మూడో అంతస్తుకు హౌస్ సర్జన్ వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. తెల్లవారుజామున 2.45 గంటలకు తాను మూడో ఫ్లోర్‌కు వెళ్లినట్టు అతడు చెప్పాడు. అలాగే, హతురాలితో ఇంటెర్న్ కూడా మాట్లాడినట్టు గుర్తించారు.

సీబీఐ వర్గాల ప్రకారం.. మొదటి ఏడాది పీజీ విద్యార్థులు ఇద్దరు అర్ధరాత్రి తర్వాత డిన్నర్ చేశారు. అనంతరం సెమినార్ హాల్‌కు వెళ్లి.. నీరజ్ చోప్రా ఒలింపిక్ మ్యాచ్ చూశారు. సుమారు రాత్రి 2 గంటల సమయంలో విశ్రాంతి తీసుకోడానికి ఈ ఇద్దరూ స్లీపింగ్ రూమ్‌లోకి వెళ్లిపోగా.. బాధితురాలు మాత్రం అక్కడే ఉన్నారు. ఇంటర్న్ కూడా తాను వేరే గదిలో ఉన్నట్టు చెప్పాడు. అయితే, ఈ మూడు గదులు, సెమీనార్ హాల్ మూడో అంతస్తులో ఒకదానికి ఒకటి సమీపంలో ఉంటాయి.

హత్యాచారం జరిగిన సెమినార్‌ హాల్‌ డోర్‌ గొళ్లెం పనిచేయడం లేదని విచారణలో బయటపడినట్లు సీబీఐ తెలిపింది. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నేరం జరుగుతుండగా ఎవరూ లోనికి రాకుండా ఉండేందుకు హాల్‌ బయట ఎవరైనా నిలబడి సహకరించారా? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ విషయాన్ని నిర్ధరించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. గొళ్లెం పనిచేయకపోవడం గురించి ఈ నలుగురు సహచర వైద్యులు విచారణలో బయటపెట్టినట్లు సీబీఐ వెల్లడించింది. దీంతో బోల్ట్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button