అన్ని సేవలూ ఒకే యాప్‌లో.. చంద్రబాబు సరికొత్త ఆలోచన..

పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు అందించే సేవలను అన్నింటిని కలిపి ఒక యాప్ రూపంలో తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు యాప్ రూపకల్పన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే టాటా సంస్థ ఈ విషయంలో ప్రత్యేక యాప్ రూపొందించిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు.. ఈ యాప్ కొంతవరకూ మెరుగైన సేవలు అందిస్తోందని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం తరుఫున కూడా ఇదే తరహాలో యాప్ రూపకల్పనకు కసరత్తు చేయాలని సూచించారు.

మరోవైపు ఏపీలో రిలయన్స్ సంస్థ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ వర్సిటీ, ఎస్ఆర్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే సైబర్ సెక్యూరిటికి సంబంధించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏమూల ఏ చిన్న ఘటన జరిగినా తెలిసే విధంగా.. సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు.. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ నంబర్ వన్ కావాలని.. ఆ రకంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం ఐటీ కంపెనీల దృష్టి టైర్ 2 నగరాలపై పడిందన్న చంద్రబాబు.. ద్వితీయ శ్రేణి నగరాల్లో విస్తరించేందుకు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ అవకాశాన్ని ఆధారంగా చేసుకుని ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు సాగించాలని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌కు సూచించారు. ఇక విశాఖపట్నం ఐఐఎం, తిరుపతి ఐఐటీ, ఇతర ఎడ్యుకేషన్ సంస్థల సహకారంతో దేశంలో ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న అంకుర పరిశ్రమలను గుర్తించి వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ, టెస్టింగ్ పార్కు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌తో పాటుగా సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేశ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

About rednews

Check Also

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *