ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan indirect comments on Allu Arjun Pushpa Movie: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఇదీ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్.. బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు. కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చే విషయమై సీఎంతో చర్చించారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత విలేకర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్, మెగా అభిమానుల మధ్య మరోసారి సోషల్ మీడియా వార్‌కు ఆజ్యం పోస్తున్నాయి.

విలేకర్ల సమావేశంలో పవన్ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ నటించిన గందదగుడి సినిమాను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమాలో హీరో అడవులను కాపాడుతారని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవవ్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గత కొంతకాలంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రచ్చ నడుస్తోంది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ.. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనితో మరింత ఎక్కువైంది, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు. అయితే శిల్పారవి స్నేహితుడు కావటంతో.. ఆయన ఇంటికి వెళ్లి మరీ అల్లు అర్జున్ మద్దతు తెలిపారు.

అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతు ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కూడా ట్వీట్ చేయడంతో అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా అప్పట్లో వార్ జరిగింది. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సైతం అంటీముట్టనట్టుగా ఉంటున్నారని సినీ వర్గాల్లో టాక్. అయితే మెగా ఫ్యామిలీ కలిసి కూర్చుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటూ.. బన్నీ వాసు లాంటి మెగా ఫ్యామిలీ సన్నిహితులు అప్పడప్పుడూ చెప్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ నడుస్తోంది. త్వరలోనే పుష్ప 2 కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి సినిమాల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేసేవారే హీరోలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఈ సినిమా గురించేనంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. మరి దీనిపై అల్లు, మెగా ఫ్యామిలీలు ఎలా స్పందిస్తాయనేదీ చూడాలి మరి.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *