ఏపీలో వాళ్లకు నెలకు రూ.5వేలు.. జగన్ సర్కార్ పథకం కొనసాగింపు..పేరు మార్పు, కొత్త పేరిదే

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ఏపీ ప్రభుత్వం హామీల, పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని హామీలు, పథకాలను అమలు చేస్తోంది.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే గత జగన్ సర్కార్ హయాంలో ఉన్న కొన్ని పథకాలను కొనసాగిస్తోంది.. కాకపోతే వాటికి పేర్లు మారుస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలకు పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తాజాగా మరో పథకం పేరును కూడా మార్చారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

గత జగన్ సర్కార్ హయాంలో వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకం పేరును ‘న్యాయమిత్ర’గా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) వి సునీత ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు త్వరలో జారీ చేస్తామని అధికారులు తెలిపారు.. ఈ న్యాయమిత్ర పథకం ద్వారా జూనియర్‌ న్యాయవాదులకు స్టైఫండ్‌ అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా న్యాయ శాస్త్రం ప‌ట్టా అందుకుని న్యాయ‌వాద వృత్తిలోకి కొత్త‌గా అడుగుపెట్టిన జూనియ‌ర్ న్యాయ‌వాదుల‌కు ప్ర‌తి నెలా రూ. 5,000 స్టైఫండ్ అందజేస్తారు. గత ప్రభుత్వం 2019 డిసెంబ‌ర్‌లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఏడాదికి రూ.60 వేలు అంటే నెలకు రూ.5 వేల చొప్పున అందజేశారు. ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది.. కాకపోతే పథకం పేరును మాత్రమే మార్చింది.

రెండు రోజుల క్రితం కూడా మరో పథకానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం పేరు మార్చారు. ఇక నుంచి ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టుగా మారుస్తూ.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. తాజాగా లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చారు. పథకం పేరు మార్చినా కొనసాగించడంపై జూనియర్ న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం ఇప్పటికే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా మార్పు చేసింది. వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్పు చేశారు. వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు మార్చిన సంగతి తెలిసిందే. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్పు చేసింది కూటమి ప్రభుత్వం. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. మన బడి – నాడు నేడును మన బడి – మన భవిష్యత్తుగా మార్చారు. జగనన్న ఆణిముత్యాలును అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారంగా మారార్చారు. ఇవే కూడా మరికొన్ని పథకాలకు కూడా పేర్లు మార్చారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *