వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సస్పెండ్.. ఏపీ మంత్రిపై పోటీచేసి ఓడిన సీనియర్ నేత

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. అయితే ఆ తర్వాత నుంచి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.. ఏకంగా ఇద్దరు ఎంపీలు, ముగ్గరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అలాగే వైఎస్సార్‌‌సీపీలో సీనియర్లుగా ఉన్నవారంతా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోతున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ మాత్రం పార్టీ నుంచి ఒకరిద్దరు నేతల్ని సస్పెండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మాజీ మంత్రి రోజా నియోజకవర్గంలో కేజే శాంతి, కుమార్ దంపతుల్ని సస్పెండ్ చేశారు.. తాజాగా మరో మాజీ ఎమ్మెల్సీపై కూడా వేటు పడింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదులు రాగా.. విచారణ జరిపి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును పార్టీ అధినేత జగన్‌ సస్పెండ్‌ చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజును నియమించారు.

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మేకా శేషుబాబు స్పందించారు. తనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘నా ఎస్సీ, నా బీసీ అంటారే తప్ప.. వారికి గౌరవం ఎక్కడ’ఉందో చెప్పాలన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారిని పక్కన పెట్టి.. గతంలో జగన్‌ను బూతులు తిట్టిన వారికే గుర్తింపు ఇచ్చారన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని.. డబ్బులు పోగొట్టుకున్నాన్నారు. కనీసం పార్టీ జెండా, అజెండా లేని సమయంలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉండాలనే జగన్ వెంట నడిచానన్నారు.

తనకు కేబినెట్‌ పదవి ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచానన్నారు శేషుబాబు. వైఎస్సార్‌ జయంతి పేరుతో సేవా కార్యక్రమాలు చేపడితే పార్టీ వ్యతిరేక పనులు చేసినట్లా.. ఒకవేళ నియోజకవర్గంలో పార్టీ నుంచి బహిష్కరిస్తే ఇంఛార్జ్‌ను బయటకు పంపాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంత ఖర్చయినా భరిస్తానని నమ్మించారని.. కనీసం పార్టీ ఇచ్చిన రూ.30 కోట్లు ఏమయ్యాయో అధిష్ఠానానికి, ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నియోజకవర్గంలో కొందరిపై ఆధారపడి పార్టీని నడిపితే నాయకుడిపై నమ్మకం పోతుందన్నారు. అక్కడ కింది స్థాయిలో పరిస్థితులు గమనించి అడుగులు వేయాలని.. లేకపోతే నష్టం తప్పదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేనికీ స్పందించిన జగన్‌ ప్రస్తుత వరదల్లో ప్రజలను ఓదార్చడాన్ని ఎవరూ నమ్మరని.. దారుణమైన పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి తోసేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు పలువురు నేతలు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ చెబుతానన్నారు మేకా శేషుబాబు. ఈయన 2014 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడిపై పాలకొల్లు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *