హైదరాబాద్‌వాసులకు ఆమ్రపాలి తీపికబురు.. నిమజ్జనానికి వచ్చేవారికి ఉచిత భోజనం..!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల కోలాహలం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా గణనాథులను ప్రతిష్ఠించగా.. మూడో రోజు నుంచే నగరంలో నిమజ్జనాలు మొదలయ్యాయి. అయితే.. హైదరాబాద్‌లోని బడాబడా గణేషులు తొమ్మిదో రోజున లేదా పదకొండో రోజున గంగమ్మ ఒడికి చేరుకోవటం ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగానే.. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం జరగనుంది. అదే రోజున నగరవ్యాప్తంగా ఉన్న భారీ గణనాథులు కూడా.. గంగమ్మ ఒడి చేరుకునేందుకు హుస్సేన్ సాగర్‌కు క్యూ కట్టనున్నాయి.

అయితే.. ఈ మహా నిమజ్జన కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు నగరం నలువైపుల నుంచే కాదు.. పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. నిమజ్జనం రోజున స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటిస్తుండటంతో.. కుంటుబ సమేతంగా వచ్చి గణనాథులను గంగమ్మ ఒడికి సాగనంపుతారు. దీంతో.. హైదరాబాద్‌లో మహాసంబరమే కనువిందు చేయనుంది.

ఈ క్రమంలో.. నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. పెద్ద ఎత్తున తరలిరానున్న గణేషులతో పాటు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ.. ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే.. గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ తరపున అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ ఆమ్రపాలి కాటా పేర్కొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీతో పాటు 18, 19 తేదీల్లో మొత్తంగా మూడు రోజులపాటు 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది విధుల్లో ఉంటారని ఆమ్రపాలి పేర్కొన్నారు. శానిటేషన్ సిబ్బంది, ట్యాంక్ బండ్‌లో గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్‌, సరూర్‌నగర్‌లలో మంచినీళ్లు, ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన నిమజ్జనాల సమయంలోని అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. జీహెచ్ఎంసీ తరపున ఉచితంగా భోజనం అందించనున్నట్టు ఆమ్రపాలి తెలిపారు. మరోవైపు.. శోభాయాత్రలు నిర్వహించే రహదారులను ఇప్పటికే రిపేర్‌ చేశామని.. ఆ మార్గాల్లో స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు చేసినటట్టు తెలిపారు.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *