Uncategorized

లక్కీ భాస్కర్‌ను మించిపోయావ్ కదా మావ.! కిలోల బంగారం హుష్ కాకి..!

ప్రజల్లో ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకాన్ని వమ్ము చేసే ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఎస్‌బీఐ గోల్డ్ లోన్ గోల్‌మాల్ ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లాలోని ఎస్‌బీఐలో మరో గోల్డ్ లోన్ గోల్ మాల్ వ్యవహారం బట్టబయలైంది. సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా ఆడిట్‌లోనే అక్రమాల భాగోతం బయటపడింది. నిర్మల్ లోనూ ఇంటి దొంగే బ్యాంకుకు కన్నం వేసి 20 లక్షల రూపాయలకు పైగా స్కామ్‌కు పాల్పడ్డాడు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో బ్యాంకు మోసం బట్టబయలైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐ బ్యాంకు గోల్‌మాల్ ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో నకిలీ బంగారం గోల్‌మాల్ భాగోతం బయటపడింది. బ్యాంకు అప్రైజర్ గా పని చేస్తున్న ప్రశాంత్ చేతివాటం ప్రదర్శించి 41 ఖాతా దారుల పేరిట స్నేహితులతో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టించాడు. దాదాపు 20 లక్షల రూపాయలు మాయం చేసినట్టు తేలింది‌. చెన్నూర్ ఎస్‌బీఐ బ్యాంక్ తరహాలోనే ఇక్కడ కూడా ఆడిట్ సమయంలోనే ఈ యవ్వారం బట్టబయలైంది.

ఆడిట్ లో 900 గ్రాముల బంగారం నకిలీదిగా తేలింది. అధికారులు తమదైన స్టైల్ లో విచారణ జరపగా, బ్యాంకు అప్రైజర్ గా పని చేస్తున్న ప్రశాంత్ తానే ఈ మోసం చేశానని ఒప్పుకున్నాడు. నాణ్యతలేని 900 గ్రాముల బంగారాన్ని తన స్నేహితుల పేరిట తాకట్టు పెట్టించి రుణాలు పొందినట్టుగా ఒప్పుకున్నాడు. రుణం తీసుకునే డబ్బును సొంత ఖర్చులకు వాడుకున్నట్టు తేలింది. బ్యాంకు సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినా ఆ నోట ఈ నోట నిర్మల్ ఎస్‌బీఐ వ్యవహారం బయటకు పొక్కింది.

దీంతో పరువు కాపాడుకునేందుకు రాత్రికి రాత్రి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి బ్యాంకు కట్టినట్టు సమాచారం. వడ్డీ డబ్బులు త్వరలోనే చెల్లిస్తానని బ్యాంకు అధికారులకు తెలిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ స్కామ్‌కు బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ సహకరించినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button