
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేనిఫెస్టోలో చెప్పక పోయినా మహిళల కోసం మరో కొత్త పథకం అమలుకు సిద్దం అయింది. ఇందు కోసం ముహూర్తం ఖరారు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న డ్వాక్రా మహిళలకు ఆర్దికంగా భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలు ద్వారా ఆడబిడ్దల పెళ్లికి ఆర్దికంగా ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది.
ఈ పథకం అమలు కోసం రూ.250 కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి కనీసం 25 వేల మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు లబ్ధి చేకూరేలా అమలు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఇందు కోసం అర్హతలను నిర్ధారించారు. డ్వాక్రా సభ్యురాలిగా ఆరేళ్లు దాటిన మహిళల కుమార్తెలు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వారి అవసరం మేరకు రూ 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు 4శాతం వడ్డీకి రుణం మంజూరు చేస్తారు. గరిష్టంగా 48 వాయిదాల్లో తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే కల్యాణలక్ష్మి పథకం కింద రుణం ఇస్తారు. స్థానిక వెలుగు కార్యాలయం లేదా వీవోఏ, యానిమేటర్ ద్వారా గానీ ఈ పథకానికి అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. లబ్ధిదారు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా సంబంధిత అధికారులు పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు.


