ఆంధ్రప్రదేశ్

కర్నూలులో ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ సంతాపం, నష్టపరిహారం ప్రకటన

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు.

మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న కర్ణాటక భక్తులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం, ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, బాలికలు కూడా ఉండటం విషాదాన్ని మరింత పెంచింది.

గాయపడిన వారిని ఎమ్మిగనూరు మరియు కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిరి బాధితులను పరామర్శించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ ప్రమాదానికి బొలెరో డ్రైవర్ నిద్ర మత్తే కారణమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించేందుకు కర్ణాటక అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు.

ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ ఘటనను అత్యంత విషాదకరమని పేర్కొంటూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button