తెలంగాణ కుల గణన వివరాలు బహిర్గతం.. బీసీలే మెజార్టీ

తెలంగాణలో కులాల వారీగా సమగ్ర గణాంకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిర్గతం చేసింది. గతంలో కేవలం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా శాతాలను మాత్రమే వెల్లడించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రతి కులానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్రంలో మొత్తం జనాభాలో బీసీలు 56.33 శాతం ఉండగా, అందులో ముస్లిం బీసీలు 10.08 శాతం ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు వెల్లడించింది. ఓసీ వర్గాల్లో జనాభా పరంగా రెడ్డి కులం ముందంజలో ఉండగా, తరువాతి స్థానాల్లో యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరుకాపు కులాలు ఉన్నాయి.
కులగణనలో విద్య, ఆర్థిక, సామాజిక అంశాల ఆధారంగా కులాల మధ్య గణనీయమైన అసమానతలు ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా బీసీల్లోని 56 కులాల మధ్య పెద్ద తేడాలు ఉన్నాయని, కొన్ని వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఓసీలకు సమాన స్థాయిలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
అగ్రకులాలవారే భూములు, ఆస్తులు, విద్య, ఉద్యోగాల్లో ముందంజలో ఉన్నారని గణాంకాలు స్పష్టం చేశాయి. ఓసీల్లో సుమారు 12 లక్షల మంది తమ కులాన్ని వెల్లడించనట్లు కూడా నివేదిక తెలిపింది.
అత్యధిక జనాభా ఉన్న కులాల్లో మాదిగ, ముదిరాజ్, లంబాడీ, యాదవ, రెడ్డి, గౌడ, మాల, మున్నూరుకాపు, పద్మశాలి కులాలు ఉన్నాయి.
ఈ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కులగణనపై పార్లమెంటులో చర్చ జరగాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

