Uncategorized

తిరుపతిలో మిస్టరీ మరణాలు.. అటవీ ప్రాంతంతో లభ్యమైన నాలుగు మృతదేహాలు!

తిరుపతి జిల్లా పాకాల మండలంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పాకాల వారి పల్లి అటవీ ప్రాంతంలో నాలుగు డెడ్ బాడీలు లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటవీ ప్రాంతంలోకి పశువులను మేపేందుకు వెళ్లిన స్థానికులకు ఈ మృతదేహాలు కనిపించడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చెట్టుకు ఉరి వేసుకున్న రెండు మృతదేహాలను గుర్తించగా పక్కనే మరో రెండు డెడ్ బాడీలను పూడ్చి పెట్టినట్లు కనుగొన్నారు. చెట్టుకు వేలాడిన రెండు డెడ్ బాడీ ల్లో ఒకటి మహిళది కాగా మరొకటి పురుషుడిదిగా గుర్తించారు.

చెట్టుకు ఒక మృతదేహం వేలాడుతూనే ఉండగా మరో మృతదేహం కింద పడిపోయింది. అక్కడే మరో రెండు డెడ్ బాడీలను పూడ్చిపెట్టినట్లుగా కూడా గుర్తించిన అధికారులు.. అవి చిన్నపిల్లల మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. దాదాపు వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఖాళీ మద్యం బాటిల్లు, మాత్రలు, దుస్తులు, చెప్పులు లభ్యం కావడంతో వాళ్ల మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎవరు గుర్తించని ప్రాంతానికి వీరు ఎలా చేరుకున్నారు, ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదంటే ఎవరైనా హతమార్చి ఉంటారా? అన్నదానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టేందుకు డెడ్ బాడీలను వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించనున్న పోలీసులు డెడ్ బాడీస్ వద్ద ఆధారాలను సేకరిస్తున్నారు. అక్కడ లభించిన వాటిని పరిశీలిస్తున్న పోలీసులు ఆ ప్రాంతానికి వారు ఎలా చేరుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు చుట్టుపక్కల గ్రామాల్లో విచారిస్తూ లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఆ మృతదేహాలు ఎవరివి అనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button