చారిత్రాత్మక అడుగు: ప్రధాని నరేంద్ర మోదీ

కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, అలాగే నియోజకవర్గాల సంఖ్య పెంపు వంటి అంశాలపై కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, మరికొద్దిసేపట్లో పార్లమెంటులో మూడు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది.
ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మహిళా సాధికారత వైపు దేశం చరిత్రాత్మక అడుగు వేయబోతోందని ఆయన పేర్కొన్నారు. భారత మహిళల పట్ల గౌరవ భావంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి ఇచ్చే గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహిళల మహత్తును ప్రతిబింబించే శ్లోకాన్ని కూడా ప్రధాని పంచుకున్నారు.
మహిళల రిజర్వేషన్ మరియు నియోజకవర్గాల పెంపు అంశాలపై కీలక బిల్లులను చట్టరూపం దిద్దేందుకు పార్లమెంటు నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో లోక్సభ సీట్ల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్ఠంగా 850 వరకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువస్తోంది. అయితే, తుది సీట్ల సంఖ్యను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది.
ఈ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందితే, 2029 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా, జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల కేటాయింపు జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
