
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండిపడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనజీవనం కష్టంగా మారింది.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల ప్రభావం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచుతున్నాయి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు దాదాపు 14 జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉండనుంది.
ఇప్పటివరకు కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 45°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 262 మండలాల్లో 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం 101 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



