Uncategorized

గురుకుల విద్యార్థినికి అరుదైన అవకాశం.. ఎర్రకోటలో వేడుకలకు కేంద్రం ఆహ్వానం

78వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ఈ వేడుకలకు దేశం నలుమూల నుంచి ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వివిధ రంగాల్లో ప్రత్యేక సేవలు అందించటం ద్వారా గుర్తింపు పొందిన సామాన్యులను.. అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించటం ఆనవాయితీ. అయితే.. ఆ ప్రత్యేక అతిథుల జాబితాలో తెలంగాణకు చెందినవాళ్లు కూడా ఉండటం విశేషం. అతిథుల జాబితాలో రైతు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు.. అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఆశా కార్యకర్తలు.. విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. సామాజిక కార్యకర్తలు.. ఇలా చాలామందే ఉన్నారు. దేశ సాధికారత కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా వీళ్లందరిని వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్రం ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థినికి కూడా కేంద్రం నుంచి ఆహ్వానం అందటం గమనార్హం.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని.. తెలంగాణ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వి గ్రేషిత.. ఎర్రకోట వేడుకలకు హాజరుకావాలని కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం రావడం పట్ల గ్రేషిత హర్షం వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం గ్రేషితను అభినందించారు.

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు కూర సుజాత కూడా ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఈ అరుదైన అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మే 2024లో గుజరాత్‌లో జరిగిన జాతీయ స్థాయి ప్రేరణ కార్యక్రమంలో పాల్గొన్న సుజాత.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

వీళ్లతో పాటు.. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్‌కు చెందిన శశాంక్ విశ్వనాథ్‌కు కూడా.. ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఈ ఆహ్వానం పట్ల విశ్వనాథ్‌ కూడా తన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశం కొద్ది మందికే దొరుకుతుందని.. అందులో తనకు ఇలాంటి ఛాన్స్ దొరకటం తన అదృష్టమని చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button